Wednesday, December 16, 2009

నందమూరి తారక రామారావు కృష్ణాజిల్లాలోని నిమ్మకూరు గ్రామంలో 28-05-1923న జన్మించారు. తండ్రి లక్ష్మయ్య చౌదరి, తల్లి వెంకట్రావమ్మ. ఎన్.టి.ఆర్, పెద్దనాన్న రామయ్య-చంద్రమ్మ దంపతులకు సంతానం లేకపోవడంతో వారికి ఎన్.టి.ఆర్ దత్తపుత్రుడుగా మారిపోయారు. వాళ్ళ్లు చాలా గారాబంగాపెంచారు. ఇద్దరు తండ్రులూ, ఇద్దరు తల్లులకు ముద్దుల కొడుకుగా పెరిగాడు. వీరిది మోతుబరి రైతుకుటుంబం. ఎన్.టి.ఆర్ అక్షరాభ్యాసం నిమ్మకూరులోనే జరిగింది. నిమ్మకూరులో ఆరోజులలో ఐదవ తరగతి వరకే ఉంది. అదీ ఏకోపాధ్యాయ ప్రాథమిక పాఠశాల. అతనికి ఓనమాలు నేర్పిన ఉపాధ్యాయుడు వల్లూరు సుబ్బారావు. పెద్దబాల శిక్ష మొదలుకొని భారత రామాయణాలను నేర్చుకొన్నాడు. సాహిత్య, సాంస్కృతిక సౌరభాలు శైవంలోనే గుభాళించాయి. పౌరాణిక సాహిత్యం పట్ల అనురక్తి ఆనాడే ఏర్పడింది. అతని గొంతు అందరికి ఆకర్షణీయంగా ఉండేది. చిన్నతనంలోనే బాలరామాయణం వల్లెవేయడంలో ప్రావీణ్యం సంపాదించారు. కంఠంలో ఓప్రత్యేకత ఉండేది. ముత్యాలవంటి దస్తూరీ ఉండేది. చిత్రకళలో కూడా మంచి నేర్పు సంపాదించారు. ఇక రూపం విషయంలో అతను స్పురద్రూపి. నిండుగా అందంగా ఉండేవారు. శ్రమైకజీవనసౌందర్య బీజాలు చిన్నతనంలోనే ఆయన మనస్సులో గాఢంగా నాటుకున్నాయి. చదువుకుంటూనే పొలం పనులకు వెళ్ళ్లేవారు. ఊరిలోని జాతరలలో నాటకాలువేసేవారు. అందులో అయన బాలరామాయణగానం ఒక ప్రత్యేకాకర్షణ. ఊళ్ళ్లోని ఐదవ తరగతి తర్వాత విజయవాడ వన్ టౌన్ లోని గాంధీ మున్సిపల్ హైస్కూల్లో ప్రవేశించారు. స్కూలు పైనల్ అక్కడే పాసయ్యారు. తర్వాత విజయవాడలోనే ఎస్.ఆర్.ఆర్. అండ్ సి.వి.ఆర్ కాలేజీలో ఇంటర్ మీడియట్ లోప్రవేశించారు. అదే సమయంలో తండ్రి వ్యవసాయం దెబ్బతిన్నది. తండ్రి విజయవాడలోనే పాడిపశువుల పెంపకం చేపట్టారు. రామారావు చదువుసాగిస్తూనే సైకిల్ పై హొటళ్ళ్లకు పాలుపోసి వస్తూ తండ్రికి సహకరించేవారు.




ఇంటర్ లో విశ్వనాథ సత్యనారాయణ రామారావుకు గురువు. ఆయన రాసిన "రాచమల్లుని దౌత్యం" అనే నాటకంలో ఎన్.టి.ఆర్. నూనూగు మీసాలతోనే "నాగమ్మ" అనే హీరోయిన్ వేషం వేశారు. "మీసాల నాగమ్మ"గా బహుమతి కూడా కొట్టేశాడు. అలా జరిగిన తొలి రంగస్థల ప్రవేశం ఆయనలో కళారంగంపట్ల ఆసక్తిని పెంచింది. ఇంటర్ సెకండ్ ఇయర్లో "అనార్కలి"లో సలీంగా నటించి ప్రథమ బహుమతి పొందారు. ఆ ఉత్సాహంతోనే నేషనల్ ఆర్ట్ థియేటర్, ఎంగ్ ఆంధ్రా అసోసియేషన్ల ఆధ్వర్యంలో నాటక ప్రదర్శనలిచ్చి, ఔత్సాహిక కళాకారుడిగా రూపొందారు. 1942 మేలో మేనమామ కూతురు కొమరవోలు మునసబు కాట్రగడ్డ చెంచయ్య కూతురు బసవతారకంతో రామారావుకు 20వ యేట వివాహం అయింది. నాటకాభిరుచి, వైవాహిక జీవితంతో ఇంటర్ ఫేయిలయ్యారు. ఖాళీగా ఉండక చిన్న చిన్న ఉద్యోగాలూ, వ్యాపారాలూ చేశారు. సౌండ్ రికార్డింగ్ శిక్షణ కోసం బొంబాయి వెళ్ళ్లారు. అక్కడే ఒక ఆంధ్రామెస్ సడిపారు. ఇవేమీ లాభం లేక పోవడంతో మళ్ళ్లీ విజయవాడకు వచ్చి తండ్రి పాలవ్యాపారానికి తోడుగా పొగాకు-వ్యాపారం ప్రారంభించారు. కష్టపడి ఇంటర్ పాసయ్యారు. గుంటూరు ఎ.సి.కాలేజీలో బి.ఎలో జాయిన్అయ్యారు. అక్కడ కూడా ఆయన నటనాజీవితం కొనసాగింది. కొంగర జగ్గయ్య ఆయనకు ప్రత్యర్థి. ఇరువురు పరిషత్ పోటీలకు కూడా వెళ్ళ్లేవారు. కాలేజీలో వేసిన "నాయకురాలు" నాటకంలో ఎన్.టి.ఆర్. నలగామరాజు. దానితో అతను ప్రముఖ దర్శకులు సి.పుల్లయ్య దృష్టిలోపడ్డారు. అందగాడు, మంచికంఠం ఆకర్షించే నటన. ఇది చూసి పుల్లయ్య "సినిమాలో అవకాశం ఇస్తాను మద్రాసు రమ్మని" ఉత్తరం రాస్తే బి.ఎ పూర్తి కాకుండా సినిమాలలోకి రానన్నారు. 1947లో రామారావు బి.ఎ. పూర్తిచేశారు. అప్పటికే ఆయనకు ఒక కొడుకు రామకృష్ణ జన్మించాడు.

NANDAMURI TARAKA RAMARAO BIO DATA

జన్మించిన తేది : 1923 మే 28వ తేది, కృష్ణాజిల్లాలోని నిమ్మకూరు గ్రామం

తల్లిదండ్రులు : లక్ష్మయ్య చౌదరి, వెంకట్రావమ్మ

చదివినది : 1947లో బి.ఎ. ఉత్తీర్ణత
మొదటి ఉద్యోగం : సబ్ రిజిస్టార్

కుమారులు : జయకృష్ణ , సాయికృష్ణ , హరికృష్ణ , మోహనకృష్ణ , బాలకృష్ణ , రామకృష్ణ , జయశంకర్ కృష్ణ
కుమార్తెలు : లోకేశ్వరి , పురంద్రీశ్వరి , భువనేశ్వరి , ఉమామహేశ్వరి
తొలి చిత్రం : 1949 లో "మనదేశం"
చివరి చిత్రం : మేజర్ చంద్రకాంత్
తెలుదుదేశం ఆవిర్భావం : 1982 మార్చి 29న మధ్యాహ్నం 2-30 గం.లకు.
ప్రభుత్వ ఆవిర్భావం : 1983 జనవరి 9వ తేది

మరణం :1996 జనవరి 18వ తేది